కంగనా వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్ ఫైర్

కంగనా వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్ ఫైర్

హై‌‌‌‌దరాబాద్, వెలుగు: ఢిల్లీ నిరసనల్లో పాల్గొన్న జెన్‌‌జీ యువతులపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు అవమానకరమని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అన్నారు. కంగనా వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌‌లో విడుదల చేసిన ప్రకటనలో ఆమె మాట్లాడుతూ ఒక మహిళగా, ఎంపీగా ఉన్న కంగనా ఇలాంటి మాటలు మాట్లాడటం సరికాదన్నారు.

తమ హక్కుల కోసం పోరాడుతున్న యువతులను అవమానించేలా మాట్లాడారని విమర్శించారు. ఎయిర్‌‌పోర్టులో తనకు జరిగిన ఘటనను కంగనా మరిచిపోయారా? లేక మరిచిపోయినట్లు నటిస్తున్నారా? అని స్వర్ణ ప్రశ్నించారు. జెన్‌‌జీ యువతపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడాన్ని మహిళా కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోందని, ఇలాంటి  వ్యాఖ్యలను సహించబోమని హెచ్చరించారు.